48వ నెల నెలా తెలుగు వెన్నెల - సమీక్ష

హ్యూస్టన్ నగరం, శనివారం, మే 3, 2014

ముఖ్య అతిథి - ఆచార్య వేము భీమశంకరం గారు

హ్యూస్టన్ సాహితీలోకం నిర్వహించిన 48 "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం మే 3 తేదీన షుగర్లాండ్ గ్రంథాలయంలో ఎంతో చక్కగా జరిగింది. దాదాపు 35 మంది ప్రేక్షకులు విచ్చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డా. వేము భీమశంకరంగారు గారు.

"వెన్నెల"లోని ప్రథమాంశమైన పుస్తక సమీక్షలో డా. వంగూరి చిట్టెన్ రాజు గారు ఒక వచనకవితా సంకలనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసారు. "బాటే... బ్రతుకంతా" అన్న పుస్తక రచయిత శ్రీ అవధానుల మణిబాబుగారు. 23 కవితలు గల గ్రంథానికి ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మగారు ముందుమాట వ్రాసారు. చిట్టెన్ రాజుగారు తమదైన శైలిలో కవితలను విమర్శిస్తూ విధంగా సమీక్షించారు:
“కవి చెప్పదల్చుకున్న విషయం లో స్పష్టత ఉంది, పద ప్రయోగాలు బావున్నాయి. ఇంకా తన బాణీ (గొంతుక) వెతుక్కుంటున్న లక్షణాలు ఉన్నాయి. సరి అయిన “స్ఫూర్తి “ కలిగితే కవిగా స్పందించే పోకడలు ఉన్నాయి. మంచి కవి కి కావలసిన భాషా పరిజ్జానం, సమాజ అవగాహన, సహృదయ స్పందన, తపన, ఎన్నుకునే వస్తువుపై అవగాహన మొదలైన కొన్ని లక్షణాలు  ఉన్నాయి.”

పుస్తకంలోని రెండు కవితలను చదివి వినిపించారు చిట్టెన్ రాజుగారు. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని పొలంలో పనిచేసే రైతుతో ఎంతో చక్కగా పోలుస్తూ వ్రాసిన "ముద్ర" అనే కవిత అందరినీ ఆకట్టుకుంది.

భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథి డా. వేము భీమశంకరం గారిని పరిచయం చేస్తూ శాయి రాచకొండ గారు యాభయ్యేళ్ళ క్రిందట తమకు భీమశంకరంగారితో వున్న పరిచయాన్ని సభకు విన్నవిస్తూ వారిని వేదిక మీదికి ఆహ్వానించారు.
భీమశంకరంగారు మాట్లాడుతూ, తమకు చిన్నప్పుడు సాహిత్య రంగంలో ఏమాత్రం ప్రవేశం లేదనీ, అరవయ్యేళ్ళ వయస్సు దాటేవరకూ, అనగా భూ-భౌతిక శాస్త్రజ్ఞుడిగా, విద్యావేత్తగా పదవీ విరమణ చేసేవరకూ సాహిత్యం జోలికి పోలేదన్నారు. తరువాత సమయాన్ని వృథా చేయకుండా రచనా వ్యాసంగం వేపు మనసు మళ్ళిందని అన్నారు.
తమ ప్రసంగానికి ఆరంభంలో తాము రచించిన "తెలుగు వైభవం"నుండి రాగయుక్తంగా పాడిన సీ.డీ.లోంచి కొన్ని పద్యాలను వినిపించారు. పలు పద్యకవితా గ్రంథాలు రచించిన భీమశంకరంగారు దాదాపు అన్నింటినీ సభకు పరిచయం చేసి వాటిలోని కొన్ని పద్యాలను, సందర్భాలను, వాటి వెనక నేపథ్యాన్నీ పేర్కొన్నారు.
ఛందోబద్ధమైన పద్యాలంటే తమకు ఎంతో మక్కువ ఉందని, ఇతర కవితా ప్రక్రియల కంటే పద్యాలపైనే పక్షపాతం కూడా వున్నదని అంగీకరించారు. ఛందస్సులో ఎంతో అమరిక వున్నదని, సంస్కృత వృత్తాలలైనా, తెలుగువైనా వాటిలోని గణాల కూర్పనేది గణితశాస్త్ర నిబద్ధంగా ఉంటుందనీ వివరించినప్పుడు భీమశంకరంగారి లోని శాస్త్రజ్ఞుడి దృక్పథం వెలువడింది.

తమ ఇంటిపేరు "వేమూరి" నుండి "వేము"గా ఎలా మారిందో వివరిస్తూ, వేము వంశవృక్షం పై కొంత పరిశొధన చేసి, తమ పూర్వీకులకు సంబంధించిన కథాంశాలను వస్తువుగా ఎన్నుకొని వ్రాసిన "రసస్రువు" గ్రంథంలో నుండి కొన్ని పద్యాలు చదివి వినిపించారు. స్వతహాగా ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని దశాబ్దాలు పని చేసిన భీమశంకరం గారు పద్యాల వెనుకనున్న కథను, పద్యాల విశ్లేషణను ఎంతో ఆసక్తికరంగా ప్రసంగించారు. కొన్ని శతాబ్దాల నాటి ఆంధ్రదేశంలోని సాంఘిక పరిస్థితిని తమ కథల్లో చూపుతూ, కథలలోనే కొన్ని చారిత్రక సంఘటనలను, కొంత కల్పనను, అక్కడక్కడ అతిశయోక్తిని కూడా వాడి రచించిన పద్యకావమది.
పుస్తకంలోని కథకు సంబంధించిన పద్యాలతో పాటు తాము పద్యనిర్మాణంలో చేసిన కొన్ని ప్రయోగాలను కూడా పరిచయం చేశారు. చతుర్విధ కందము (ఒకే కంద పద్యంలో నాలుగు కందపద్యాలు ఇమిడి వుండడం), సీసపద్యంలో మత్తేభ కంద పద్యాలు దాగి వుండడం మొదలైనవి ఎన్నో ప్రయోగాలు చేసిన భీమశంకరం గారు వాటిలో కొన్నిటిని చదివి వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

భీమశంకరం గారి మరొక రచన పేరు "శ్రీరామ! నీ నామమేమి రుచిర!". అపరాధ పరిశోధన కథా వస్తువుగా గల పుస్తకం కూడా ఆద్యంతమూ చక్కటి పద్యాలతో సమకూర్చబడినది. ఇటువంటి సాంఘిక డిటెక్టివ్ ఇతివృత్తం గల పద్యకావ్యం ఎంతో అరుదు. కథను ప్రేక్షకులకు చెబుతూ గ్రంథంలోని పద్యాలను వినిపించి, గ్రంథం యొక్క నామౌచిత్యాన్ని కూడా వివరించారు.
దక్షారామ భీమేశ్వర శతకం, శివానంద మందహాసం మొదలుగా మరికొన్ని రచనలను క్లుప్తంగా పరిచయం చేసి తమ ప్రసంగాన్ని పూర్తి చేసారు భీమశంకరం గారు.

"అప్పుడే అయిపోయిందా!?" అనిపించేట్టు భాషించిన ఆచార్య వేము భీమశంకరంగారి ప్రసంగం పూర్తయిన తరువాత స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు మారుతి రెడ్డి గారు, పల్లవిగారు, చిట్టెన్ రాజు గారు భీమశంకరం గారిని సత్కరించారు. భీమశంకరంగారి ప్రసంగానికి స్పందిస్తూ మన "నెల నెలా తెలుగు వెన్నెల"లో పద్యకవిత ముఖ్యాంశంగా జరిగే కార్యక్రమాలు చాలా అరుదనీ, అద్భుతమైన ప్రసంగాన్ని వినే అదృష్టం కలిగిందనీ పలువురు ప్రేక్షకులు పేర్కొన్నారు.


టీ.సీ.. సమర్పించిన తేనీరు, పకోడీలతో కార్యక్రమం ముగిసింది.