నెల నెలా తెలుగు వెన్నెల - 03/22/2013 - శుక్రవారం 

శుక్రవారం, మార్చి 22న అష్టలక్ష్మి గుడిలో నెల నెలా తెలుగు వెన్నెల విజయవంతంగా జరిగింది.

రెండు చర్చాంశాలు ఉంటాయని ప్రకటించినా, మొదటి అంశం మీదనే అంతో ఆసక్తికరంగా, ప్రయోజనాత్మకంగా చర్చ జరగడంతో రెండవ అంశం వచ్చే నెల "వెన్నెల" కార్యక్రమానికి జరుపవలసి వచ్చింది. నేటి కార్యక్రమంలోని ప్రత్యేకత, 20 ఏళ్ళ లోపు వయసు గల తెలుగు పిల్లలు రావడం, ఉత్సాహంగా పాల్గొనడం. అలా వచ్చిన యువ ప్రతినిధులు చంద్రలేఖ కొవ్వలి, గాయత్రి ముళ్ళపూడి, ముకుంద శ్రీరాం చిలుకూరి.

20 మందికి పైగా విచ్చేసిన కార్యక్రమంలో మొదటి చర్చాంశం: "తెలుగు భాషా సంస్కృతులను సంరక్షించడంపై భావితరం దృక్పథం" (Perspectives from Youth on  Preserving and Propagating Telugu Culture and Language).

12 తరగతి చదువుతున్న చంద్రలేఖ కొవ్వలి చర్చకు శ్రీకారం చుడుతూ, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న యువతకు తెలుగు భాష నేర్చుకునే అవకాశాలు అతి తక్కువగా వుంటాయని, తాము పెరుగుతున్న వాతావరణం అంతా ఆంగ్ల-మయం అయి వుండడం అందుకు కారణమని అన్నారు. తెలుగు భాష నేర్చుకుని, తెలుగు సంస్కృతిలోని మాధుర్యాన్ని చవిచూడడానికి యువత ఏమి చేయాలి, ఎటువంటి అవకాశాలు అందుబాటులో వున్నాయి, అందుకు పెద్దలు ఎలా సహకరించగలరు, అని సభను ప్రశ్నించారు. సందర్భంగా, తనకు తెలుగు భాష అంటే ఎంతో ప్రీతి వుందని, ఇంటిలో తెలుగులోనే మాట్లాడతానని, చదవడము, రాయడము మాత్రం అంతగా రావని అన్నారు.

ఇటువంటి అంశాన్ని ముందుకు తెచ్చినందుకు చంద్రలేఖను అందరూ అభినందించారు. ముందు తరాలకు తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలియబరిచేందుకూ, ఎన్నో కారణాల వల్ల తెలుగు భాష అంతరించిపోతుందనే విషయం మీదా మునుపు సాహిత్య సభల్లో, సదస్సుల్లో ఎన్ని చర్చలు జరిగినా, అవన్నీ సాహిత్యవేత్తలు, రాజకీయవేత్తలు జరిపారు, పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం "మాకు సాయం చేయండి" అంటూ యువత ముందుకు రావడం విశేషం!   

సభకు వచ్చిన వారిలో అన్ని వయస్సుల వారూ ఎంతో ఉపయోగకరమైన సలహాలిచ్చారు.

హ్యూస్టన్ నగరంలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా "తెలుగు బడి" నడుపబడుతున్నదని, అందుకు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి చేయూతనిస్తున్నదని పలువురు పేర్కొన్నారు. పిల్లలు తమకొచ్చిన తెలుగు భాషను, తెలుగు పద్యాలను ప్రదర్శించడానికి కూడా మన నగరంలో ఏటా పోటీలు నిర్వహించబడుతున్నాయి.
అయితే, ఇన్ని వున్నా పిల్లలు తెలుగు భాషను నేర్చుకోవాలంటే ఇంట తల్లిదండ్రుల ప్రాముఖ్యం ఎంతైనా ఉంది. ఇంట్లో పెద్దలు, పిన్నలు తెలుగులో మాట్లాడకపోతే భాష నేర్చుకోవడానికి పిల్లల్లో ఆసక్తి ఉండదు.   

తెలుగు సంస్కృతి పరంగా ఇక్కడి పిల్లలు శాస్త్రీయ సంగీతం, నాట్యం, సినిమా సంగీతం వంటివి నేర్చుకుంటూనే ఉన్నారనీ, అవి కూడా తెలుగు భాష నేర్చుకోవడనికి బాగా సహకరిస్తాయనీ అన్నారు. తెలుగు సినిమాలు, చక్కటి హాస్య సన్నివేశాలు చూడడం కూడా తెలుగు భాష నేర్చుకోవడానికి, మరింత వర్థిల్లడానికి సాయపడతాయి.

ఇక్కడి యువత తమ మిత్రబృందంతో, బంధువులతో ఎక్కువగా ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. వారిలో తెలుగువారుంటే జ్ఞాపకం పెట్టుకుని తెలుగులో భాషించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. అటువంటి సందర్భాలలో పిల్లలు తమను తాము శాసించుకోగలగాలి, తేలిగ్గా వుంటుందని తమలో తాము ఆంగ్లంలో మాట్లాడితే తెలుగు నేర్వడం కష్టమైపోతుంది.

తెలుగు భాషపై ఆసక్తి, ప్రెమ వున్న యువతీ యువకులు సంఘటితమై నెలకు ఒకటి రెండుసార్లు కలవడం యువత వేయవలసిన ముందడుగు. ముఖాముఖి కలవడానికి వీలు లేకపోయినా స్కైపు, ఫేస్-టైము వంటి సాంకేతిక పరికరాలాను ఇందుకు సద్వినియోగ పరచుకోవచ్చును. అలా కలసినప్పుడు తమను తాము నియంత్రించుకొని తెలుగు భాషలో మాట్లాడడం, నేర్చుకునే ప్రయత్నం చేయడం ఎంతో అవసరం.
యువ-సమావేశాల్లో తెలుగులో కథా కాలక్షేపాలు, చిన్న నాటకాలు వేయడం వంటివి మంచి ఉపాయాలు.  
సమావేశాలు స్టార్బక్స్ వంటి చోట్ల గానీ, ఎవరి ఇంటిలోనో, గ్రంథాలయాల్లో గానీ పెట్టుకోవచ్చును.
ఎప్పుడైనా సరదాగా తెలుగు సినిమాలు పెట్టుకుని చూడడం కూడా ఒక మంచి ఆలోచన.

ఇవన్నీ చేయడానికి పెద్దల సలహాలు, సహకారమూ, అవసరమైతే ఆరంభ దశలో నిర్దేశము ఉండాలి, ఉంటాయి. క్రమాన్ని ఆరంభిస్తూ ముందస్తుగా ప్రతి నెలా జరిగే "వెన్నెల" కార్యక్రమాల్లో యువతీ యువకులను  ఆకట్టుకునే అంశాలకు కొంత సమయం కేటాయించాలి. అది వచ్చే నెల నుండి అమలు పరచాలని ప్రతిపాదించారు

తెలుగు లిపి కూడా నేర్చుకోవడం ఎంతో అవసరమని సభలో చాలామంది అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుండి నేర్చుకోకపోయినా కొంత ప్రయత్నము, అభ్యాసము చేసిన మీదట లిపి చదవడం, రాయడం తప్పకుండా వస్తాయి. లిపి వస్తే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలలోని ఆనందాన్ని చవి చూడగలరు. తమ సృజనాత్మకతను  పదును బెట్టి తెలుగులో కూడా వ్రాయగలరు. తెలుగు లిపి నేర్చుకోవడానికి పెద్దలు ఆలోచించి కొన్ని చక్కటి ప్రణాళికలు వేయాలి. లిపి నేర్పడం కోసం హ్యూస్టన్ తెలుగు బడి ఒక చక్కటి వాతావరణం అందిస్తుంది.

చంద్రలేఖ పూనుకున్న బృహత్కార్యం ఎంతో మెచ్చదగినది, ఆమెకు మనమందరమూ సహకరించి ప్రోత్సహించాలి

అందరూ ఉత్సాహంగా పాల్గొన్న చర్చ పూర్తయిన తరువాత "స్వీయ రచనలు" అంశం జరిగింది.
కొన్ని తెలుగు కవితలు, ఆంగ్లంలో "హైకు" కవితా ప్రక్రియ లో ఒక చక్కటి కవిత వినిపించారు ఉమ పోచంపల్లి.
నాగ్ రొట్టె తండ్రి ప్రేమను, జ్ఞాపకాలను వివరిస్తూ తాను వ్రాసిన ఒక ఉత్కంఠభరితమైన కథను వినిపించారు.
పోతన భాగవతంలోని కొన్ని ప్రఖ్యాతి గాంచిన పద్యాలను బాలమురళి కృష్ణ గోపరాజు వినిపించి, వివరించారు. నేపథ్యంలోనే వంగూరి చిట్టెన్ రాజు అడిగిన ప్రశ్న ఆధారంగా పోతన భాగవతంలోని సంక్షిప్త రామాయణం గురించి సభలో కొంత చర్చ జరిగింది.
తరువాత అమ్మ గురించి తాను వ్రాసిన ఛందోబద్ధమైన పద్యాలను చిలుకూరి సత్యదేవ్ చదివి వినిపించారు.

కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు అనుకున్న "సాహిత్యంలో స్త్రీ పాత్ర" అనే అంశాన్ని వచ్చే నెల "వెన్నెల"లో చర్చిద్దామని అంతా నిర్ణయించారు.
తమ ఆవరణను "వెన్నెల" కార్యక్రమానికి వాడుకోవడానికి అనుమతించిన అష్టలక్ష్మి గుడి నిర్వాహకులకు హార్దిక ధన్యవాదాలు.

పలువురు ప్రేమతో తెచ్చిన రుచికరమైన వంటకాలతో కార్యక్రమం ముగిసింది.