48వ నెల నెలా తెలుగు వెన్నెల - సమీక్ష

హ్యూస్టన్ నగరం, శనివారం, మే 3, 2014

ముఖ్య అతిథి - ఆచార్య వేము భీమశంకరం గారు

హ్యూస్టన్ సాహితీలోకం నిర్వహించిన 48 "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం మే 3 తేదీన షుగర్లాండ్ గ్రంథాలయంలో ఎంతో చక్కగా జరిగింది. దాదాపు 35 మంది ప్రేక్షకులు విచ్చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి డా. వేము భీమశంకరంగారు గారు.

"వెన్నెల"లోని ప్రథమాంశమైన పుస్తక సమీక్షలో డా. వంగూరి చిట్టెన్ రాజు గారు ఒక వచనకవితా సంకలనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసారు. "బాటే... బ్రతుకంతా" అన్న పుస్తక రచయిత శ్రీ అవధానుల మణిబాబుగారు. 23 కవితలు గల గ్రంథానికి ప్రముఖ ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మగారు ముందుమాట వ్రాసారు. చిట్టెన్ రాజుగారు తమదైన శైలిలో కవితలను విమర్శిస్తూ విధంగా సమీక్షించారు:
“కవి చెప్పదల్చుకున్న విషయం లో స్పష్టత ఉంది, పద ప్రయోగాలు బావున్నాయి. ఇంకా తన బాణీ (గొంతుక) వెతుక్కుంటున్న లక్షణాలు ఉన్నాయి. సరి అయిన “స్ఫూర్తి “ కలిగితే కవిగా స్పందించే పోకడలు ఉన్నాయి. మంచి కవి కి కావలసిన భాషా పరిజ్జానం, సమాజ అవగాహన, సహృదయ స్పందన, తపన, ఎన్నుకునే వస్తువుపై అవగాహన మొదలైన కొన్ని లక్షణాలు  ఉన్నాయి.”

పుస్తకంలోని రెండు కవితలను చదివి వినిపించారు చిట్టెన్ రాజుగారు. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని పొలంలో పనిచేసే రైతుతో ఎంతో చక్కగా పోలుస్తూ వ్రాసిన "ముద్ర" అనే కవిత అందరినీ ఆకట్టుకుంది.

భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథి డా. వేము భీమశంకరం గారిని పరిచయం చేస్తూ శాయి రాచకొండ గారు యాభయ్యేళ్ళ క్రిందట తమకు భీమశంకరంగారితో వున్న పరిచయాన్ని సభకు విన్నవిస్తూ వారిని వేదిక మీదికి ఆహ్వానించారు.
భీమశంకరంగారు మాట్లాడుతూ, తమకు చిన్నప్పుడు సాహిత్య రంగంలో ఏమాత్రం ప్రవేశం లేదనీ, అరవయ్యేళ్ళ వయస్సు దాటేవరకూ, అనగా భూ-భౌతిక శాస్త్రజ్ఞుడిగా, విద్యావేత్తగా పదవీ విరమణ చేసేవరకూ సాహిత్యం జోలికి పోలేదన్నారు. తరువాత సమయాన్ని వృథా చేయకుండా రచనా వ్యాసంగం వేపు మనసు మళ్ళిందని అన్నారు.
తమ ప్రసంగానికి ఆరంభంలో తాము రచించిన "తెలుగు వైభవం"నుండి రాగయుక్తంగా పాడిన సీ.డీ.లోంచి కొన్ని పద్యాలను వినిపించారు. పలు పద్యకవితా గ్రంథాలు రచించిన భీమశంకరంగారు దాదాపు అన్నింటినీ సభకు పరిచయం చేసి వాటిలోని కొన్ని పద్యాలను, సందర్భాలను, వాటి వెనక నేపథ్యాన్నీ పేర్కొన్నారు.
ఛందోబద్ధమైన పద్యాలంటే తమకు ఎంతో మక్కువ ఉందని, ఇతర కవితా ప్రక్రియల కంటే పద్యాలపైనే పక్షపాతం కూడా వున్నదని అంగీకరించారు. ఛందస్సులో ఎంతో అమరిక వున్నదని, సంస్కృత వృత్తాలలైనా, తెలుగువైనా వాటిలోని గణాల కూర్పనేది గణితశాస్త్ర నిబద్ధంగా ఉంటుందనీ వివరించినప్పుడు భీమశంకరంగారి లోని శాస్త్రజ్ఞుడి దృక్పథం వెలువడింది.

తమ ఇంటిపేరు "వేమూరి" నుండి "వేము"గా ఎలా మారిందో వివరిస్తూ, వేము వంశవృక్షం పై కొంత పరిశొధన చేసి, తమ పూర్వీకులకు సంబంధించిన కథాంశాలను వస్తువుగా ఎన్నుకొని వ్రాసిన "రసస్రువు" గ్రంథంలో నుండి కొన్ని పద్యాలు చదివి వినిపించారు. స్వతహాగా ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని దశాబ్దాలు పని చేసిన భీమశంకరం గారు పద్యాల వెనుకనున్న కథను, పద్యాల విశ్లేషణను ఎంతో ఆసక్తికరంగా ప్రసంగించారు. కొన్ని శతాబ్దాల నాటి ఆంధ్రదేశంలోని సాంఘిక పరిస్థితిని తమ కథల్లో చూపుతూ, కథలలోనే కొన్ని చారిత్రక సంఘటనలను, కొంత కల్పనను, అక్కడక్కడ అతిశయోక్తిని కూడా వాడి రచించిన పద్యకావమది.
పుస్తకంలోని కథకు సంబంధించిన పద్యాలతో పాటు తాము పద్యనిర్మాణంలో చేసిన కొన్ని ప్రయోగాలను కూడా పరిచయం చేశారు. చతుర్విధ కందము (ఒకే కంద పద్యంలో నాలుగు కందపద్యాలు ఇమిడి వుండడం), సీసపద్యంలో మత్తేభ కంద పద్యాలు దాగి వుండడం మొదలైనవి ఎన్నో ప్రయోగాలు చేసిన భీమశంకరం గారు వాటిలో కొన్నిటిని చదివి వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

భీమశంకరం గారి మరొక రచన పేరు "శ్రీరామ! నీ నామమేమి రుచిర!". అపరాధ పరిశోధన కథా వస్తువుగా గల పుస్తకం కూడా ఆద్యంతమూ చక్కటి పద్యాలతో సమకూర్చబడినది. ఇటువంటి సాంఘిక డిటెక్టివ్ ఇతివృత్తం గల పద్యకావ్యం ఎంతో అరుదు. కథను ప్రేక్షకులకు చెబుతూ గ్రంథంలోని పద్యాలను వినిపించి, గ్రంథం యొక్క నామౌచిత్యాన్ని కూడా వివరించారు.
దక్షారామ భీమేశ్వర శతకం, శివానంద మందహాసం మొదలుగా మరికొన్ని రచనలను క్లుప్తంగా పరిచయం చేసి తమ ప్రసంగాన్ని పూర్తి చేసారు భీమశంకరం గారు.

"అప్పుడే అయిపోయిందా!?" అనిపించేట్టు భాషించిన ఆచార్య వేము భీమశంకరంగారి ప్రసంగం పూర్తయిన తరువాత స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు మారుతి రెడ్డి గారు, పల్లవిగారు, చిట్టెన్ రాజు గారు భీమశంకరం గారిని సత్కరించారు. భీమశంకరంగారి ప్రసంగానికి స్పందిస్తూ మన "నెల నెలా తెలుగు వెన్నెల"లో పద్యకవిత ముఖ్యాంశంగా జరిగే కార్యక్రమాలు చాలా అరుదనీ, అద్భుతమైన ప్రసంగాన్ని వినే అదృష్టం కలిగిందనీ పలువురు ప్రేక్షకులు పేర్కొన్నారు.


టీ.సీ.. సమర్పించిన తేనీరు, పకోడీలతో కార్యక్రమం ముగిసింది.

47వ నెల నెలా తెలుగు వెన్నెల - సమీక్ష

హ్యూస్టన్ నగరం, శనివారం, ఏప్రిల్ 26, 2014

ఏప్రిల్ 26 కేటీలోని సింకో రాంచ్ గ్రంధాలయంలో 47 "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం జరుపుకున్నాము. కార్యక్రమాన్ని అనుకున్న సమయంకన్న కొద్దిగా ఆలస్యంగా ఆరంభించినా రసవత్తరమైన అంశాలతో ఎంతో తృప్తికరంగా జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చిలుకూరి సత్యదేవ్ గత నెలలో నగరంలో ఎంతో విజయవంతంగా నడిచిన టెక్సాస్ సాహిత్య సదస్సును జ్ఞాపకం చేసి, ప్రస్తుత సమావేశంలోని అంశాలను క్లుప్తంగా పేర్కొన్నారు.

నాటి మొట్టమొదటి అంశం "సామెతల అంతాక్షరి"ని పరిచయం చేస్తూ సామెతలు ప్రసంగాలకు క్రొత్త అందాన్నిస్తాయనీ, దాదాపు అన్ని భాషల్లోనూ సామెతలనేవి వుంటాయని చెప్పి కొన్ని ఉదాహరణలిచ్చారు సత్యదేవ్. అంతాక్షరి కార్యక్రమాన్ని సమన్వయకర్త రవి పొన్నపల్లి గారు చక్కగా నిర్వహించారు. విచ్చేసిన ప్రేక్షకులందరినీ రెండు జట్లుగా విభజించి, పలు ఆవృతాలు నడిపారు. అంతాక్షరి మాత్రమే కాకుండా "శంకర్ దాదా జిందాబాద్" అన్న శీర్షికతో సామెతలను ఆంగ్లంలోకి అనువదించి వాటికి మూలమైన తెలుగు సామెతలేమిటో చెప్పమని అడిగారు. కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోకుండా గదిలోని ఇరవై మందీ ఉత్సాహంగా పాల్గొనే విధంగా నడిచింది ఈ పోటీ. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నో క్రొత్త సామెతలు నేర్చుకునే అవకాశం కలిగింది.

తరువాత మధు పెమ్మరాజుగారు తమ బ్లాగునుండి "జిరాక్స్ కాపీ" అనే ఒక హాస్యభరితమైన అధ్యాయాన్ని చదివి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కునే పరిస్థితులను ఎంతో చమత్కారంగా వర్ణిస్తూ, అద్భుతమైన ఉపమానాలతో ఎంతో చక్కటి రచనను ప్రేక్షకులకు వినిపించారు.

"పుస్తక పరిచయం" శీర్షికలో రవి పొన్నపల్లి గారు "నడిచే దేవుడు" పుస్తకాన్ని సమీక్షించారు. కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరానంద సరస్వతి శంకరాచార్యులవారి గురించి నీలంరాజు వెంకటశేషయ్యగారు రచించిన గ్రంధంలో పరమాచార్యులతో రచయిత తమ అనుబంధానికి సంబంధించిన విషయాలే కాకుండా ఇతర భక్తుల అనుభవాలు కూడా వివరంగా రచించారు. భారతదేశ  స్వాతంత్ర్య పోరాటం సమయంలోనూ, దేశ రాజ్యాంగ రచన సమయంలోనూ డా. అంబేద్కర్ తదితరులతో పరమాచార్యులు జరిపిన చర్చల వివరాలు ఎంతో ఆసక్తికరమైన ఘట్టాలు.
కాకినాడ వాస్తవ్యులు, ప్రస్తుతం వారి కుమారుని వద్ద కొన్ని నెలలు గడపడానికి హ్యూస్టన్ నగరానికి వచ్చిన అయ్యగారి శ్రీరామమూర్తి గారు తెలుగు భాష యొక్క తీయదనంతో పాటు అందులోని వైవిధ్యాన్ని గురించి కూడా ప్రసంగించారు. వివిధ దైనందిన సంఘటనల్లో తెలుగు భాషను వేర్వేరు వ్యక్తులు ఎంత భిన్నంగా వాడతారో సోదాహరణంగా వివరించారు

ఇంత చక్కటి సాహిత్య సంబంధమైన కార్యక్రమానికి ముగ్ధులై, అప్పటికప్పుడు ప్రేరితులై శ్రీనివాస్ రాచపూడి గారు తమకు నచ్చిన శ్రీశ్రీ  కవితలను వినిపించారు. ఆ నేపథ్యంలో, 1980వ దశకంలో శ్రీశ్రీ అమెరికా దేశ పర్యటన చేస్తూ హ్యూస్టన్ నగరానికి వచ్చినప్పుడు వంగూరి చిట్టెన్ రాజుగారింట అతిథిగా ఉండి "సిప్రాలి" రచించిన సంఘటనను సభికులు జ్ఞాపకం చేసుకున్నారు.
తరువాత గోపాలకృష్ణ గూడపాటి గారు మే 3 తేదీన జరుగనున్న "మన బడి" సాంస్కృతిక కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు.

స్వీయరచనల విభాగంలో రవి పొన్నపల్లి గారు "అత్తారింటికి దారేది" సినిమాలోని ఒక పాటకు చక్కటి పారడీని రచించి రాగయుక్తంగా పాడి అందరినీ అలరించారు. చిలుకూరి సత్యదేవ్ గారు "మాతృదేవోభవ" అన్న కవితను చదివి వినిపించారు.

నెలవెన్నెల’కు పలువురు ప్రేక్షకులు మొదటిసారి రావడం, అందునా భారతదేశం నుండి మూడు నెలల క్రితమే ఉద్యోగరీత్యా హ్యూస్టన్ నగరానికి వచ్చిన పవన్ కుమార్ గారు సకుటుంబంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమూ ఆనందదాయకమైన విషయం.

చిలుకూరి సత్యదేవ్ గారు మున్ముందు జరుగబోయే "వెన్నెల" కార్యక్రమాల వివరాలు చెబుతూ కార్యక్రమాన్ని ముగించారు.

32వ టెక్సాస్ తెలుగు సాహిత్య సదస్సు - సమీక్ష

హ్యూస్టన్ నగరం, టెక్సాస్ - మార్చి 15, 2014

టెక్సాస్‌లో ఆరునెల్లకొకసారి జరుపుకునే తెలుగు పండుగకు ఆతిధ్యం వహించే అదృష్టం ఈసారి హ్యూస్టన్ వాసులకు లభించింది. 32 టెక్సాస్ సాహీతీ సదస్సు మార్చి 15 తారీఖున స్థానిక షుగర్ లాండు లోని అంజలి సెంటర్లో  అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందులోనూ ఈ విశిష్ట  సాంప్రదాయానికి అంకురార్పణ చేసిన పెద్దల సమక్షంలో జరుపుకోవడం విశేషం. సభలో వంగూరి చిట్టెన్ రాజు, సత్యం మందపాటి, శాయి రాచకొండ, వై.వి.రావు, గిరిజా శంకర్, మాధవరావు గోవిందరాజు, తుర్లపాటి ప్రసాద్ వంటి సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమమే హ్యూస్టన్ నగరంలో 46 "నెల నెలా తెలుగు వెన్నెల" కూడా అవడం హ్యూస్టన్ నగరవాసులకు ద్విగుణీకృతమైన ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది.
సదస్సును ఆరంభించే ముందు పలువురు అన్నపూర్ణలు ఎంతో రుచికరంగా వండి వడ్డించిన అద్భుతమైన భోజనాలు ఆ రోజు జరగబోయే సాహిత్యపు విందుకు నాంది పలికాయి. దాదాపు వందమందికి "పాట్ లక్" అనబడే ప్రక్రియ ద్వారా ఈ విందుకు ఏర్పాట్లు నిర్వహించిన లలిత రాచకొండగారికీ, అడగ్గానే ఉత్సాహంగా ముందుకొచ్చి తమ పాకశాస్త్ర ప్రావీణ్యతనంతటినీ రంగరించి భక్ష్య, భోజ్యాదులను పంపిన ఆ తల్లులకూ ధన్యవాదాలు. అన్నదాతలూ, సుఖీభవ!

రోజంతా సాగిన ఈ సభకి టెంపుల్, ఆస్టిన్, శాన్ అంటానియో, హ్యూస్టన్ నగరాలనుండి అమెరికా తెలుగు సాహిత్య ప్రముఖులు, యువ రచయితలు, సాహీతీ ఆత్మీయులు (టెక్సాత్మీయులు) పెద్ద సంఖ్యలో విచ్చేశారు. హ్యూస్టన్ సాహీతీ లోకం అధ్వర్యంలో జరిగిన ఈ సభలో సాహితీ విశ్లేషణ, స్వీయ రచనలు, చిక్కుముడి, చిన్నారుల ప్రసంగాల వంటి ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.

సమన్వయకర్త చిలుకూరి సత్యదేవ్ అతిధులని సాదరంగా ఆహ్వానించగా, చిన్నారి లాస్య ధూళిపాళ రాయప్రోలు సుబ్బారావుగారి దేశభక్తి గీతం ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ చక్కగా ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. తర్వాత స్పందన అక్కరాజు మాట్లాడుతూ తెలుగుని అభిమానించడానికి ‘దేశ బాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ లాంటి  ఉపోద్ఘాతాల అవసరం లేదు, మన మాతృబాషని మనం ప్రేమిస్తామని చెప్పిన స్పష్టమైన తీరు సభికులను ఆకట్టుకుంది.  
మొదటి విడత సాహిత్య పరిశీలనా విభాగం సత్యం మందపాటి అద్యక్షతన జరిగింది. దీనిలో మొదట పండిత పామర కోణంలో చాటు చాటుపద్యాలపై ప్రసాదరావు వెన్నెలకంటి ప్రసంగిస్తూ తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు వంటి కవుల చాటుపద్యాలతో పాటు పామరజనుల నుండి వెలువడిన చాటువులను కూడా ఉటంకించి ప్రేక్షకులను అలరించారు. భారతదేశం నుండి విచ్చేసిన జీడిగుంట విజయసారధి తమ తండ్రి జీడిగుంట రామచంద్రమూర్తిగారి రచనలపై కొంత విశ్లేషించి, ఆయన వ్రాసిన "గుడిలో పువ్వు" కథను చదివి ఆహూతుల హృదయాలలో ఆర్ద్రతను నింపారు. చక్కటి గళంతో, శాస్త్రీయంగా కొన్ని కృతులను పాడుతూ కర్ణాటక సంగీతంలోని కీర్తనలలో వుండే తత్వబోధను సీతారాం అయ్యగారి విశదీకరించారు. చివరగా భారతదేశం నుండి ఈ దేశానికి చుట్టపుచూపుగా వచ్చిన ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి రేణుక అయోల తమ కథనొకటి చదివి, తమ పూర్వీకులు, భగవాన్ రమణమహర్షికి ఆంతరంగికులు అయిన కావ్యకంట గణపతి ముని గురించి ప్రస్తావించారు.

చలన చిత్రాలు తెలుగు వారికి బాగా దగ్గరైన వినోదం కావడంతో మాధవరావు గోవిందరాజు గారు చిత్ర గీతాలపై అడిగిన ప్రశ్నలకి సభికులు ఉరకలేసిన ఉత్సాహంతో సమాధానాలు చెబుతూ పాల్గొన్నారు.

మొదటి విడత స్వీయ రచనల విభాగం వై.వి.రావు అద్యక్షతన జరిగింది.
తెలుగు బాష, ప్రాంతీయ భావాలలో ఎన్నో అపోహలు చలామణిలో ఉన్నాయని, వీటిని తొలిగించేందుకు చారిత్రక నేపధ్యం తెలుసుకోవల్సిన అవసరముందని హరి మద్దూరి తెలియజేసి, వారి పరిశోధనని స్లైడ్ల ద్వారా చూపారు. తరువాత అక్కినేనితో వారికున్న ఏళ్ళ అనుబంధాన్ని కుటుంబరావు ప్రస్తావించగా, అమెరికాలో పుట్టి, పెరిగిన చంద్రలేఖ మాతృ బాషపై తన మనోభావాలను పంచుకుని ‘బంగారు పాప’ పాటతో ముగించారు.  రాయుడు వృద్ధుల నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనను చక్కటి కథ రూపంలో చదివి వినిపించగా, కోసూరి ఉమా భారతి తమ రచనా వ్యాసంగానికి నేపథ్యాన్ని, తమ చిన్నప్పటి అనుభవాలనూ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు.

సాహిత్యానికి, సంగీతానికి, తెలుగుదనానికి పెద్ద పీట వేసిన సినీ దర్శకుడు కళాతపస్వి విశ్వనాధ్ సినీగమనాన్ని, జ్ఞాపకాలని ‘విశ్వనాదామృతం’ అనే ప్రాజెక్ట్ ద్వారా పదిలపరిచే ప్రయత్నం చేస్తున్న రాం చెరువు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ కార్యక్రమపు అంశాల కూర్పుని విరామ సమయంలో సభికులకి ప్రదర్శించారు. పకోడీలు తింటూ ఆ  ప్రివ్యూను వీక్షించి వారి ప్రయత్నాన్ని ఎంతగానో మెచ్చుకున్నారందరూ.

విరామం తరువాత పుస్తక పరిచయం కార్యక్రమాన్ని వంగూరి చిట్టెన్ రాజు నిర్వహిస్తూ, సామాన్యంగా ఎంతో హంగు, హడావిడీలతో జరిగే ఈ పుస్తకావిష్కరణ ఏ మాత్రం ఆర్భాటాలు లేకుండా జరుపుకుంటున్న రచయిత్రి వెన్నెలకంటి మాణిక్యాంబను ప్రశంసించారు. ఆమె కొన్నేళ్ళుగా వ్రాసుకున్న పాటలను "భావాలాపన" అన్న పేరుతో చక్కటి గ్రంథరూపంలో ప్రచురించారు. అందులోని కొన్ని గేయాలను అద్భుతంగా ఆలపించారామె. ఆ పుస్తకం అమ్మకానికి కాదని, ఎవరైనా ఆసక్తి గలవారు తీసుకోవచ్చునని, ఆ పాటలను ఇతరులు పాడుకోవడమే తమకు తగిన పారితోషికమనీ చెప్పకనే చెప్పారామె.

రెండవ సాహిత్య పరిశీలనా విభాగం శాయి రాచకొండ నిర్వహించారు.
ప్రథమంగా కరుణశ్రీ సాహిత్యంలోని సరళత్వాన్ని, సాహిత్య విలువలనూ సత్యం మందపాటి సోదాహరణంగా వివరించారు. పిదప పోతన భాగవతంలోని కొన్ని ఆణిముత్యాలను తుర్లపాటి ప్రసాద్ ఎంతో చక్కగా ఉటంకిస్తూ అందులోని భక్తితత్వాన్ని ప్రేక్షకులకు అనుభవింపజేసారు.
యెమెన్ నుండి రికార్డు చేసి పంపిన బాలాంత్రపు దంపతుల హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు విన్నప్పుడు ప్రాంగణం సభికుల కరతాళ ధ్వనులతో నిండిపోయింది. నాటకీయ ఫక్కీలో రాగయుక్తంగా బాలాంత్రపు శారద పాడిన పద్యాన్ని అందరూ ఎంతో మెచ్చుకుని, అప్పుడే అయిపోయిందా అనుకున్నారు.
తరువాత సుమ నూతలపాటి తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా పేరుగాంచిన వారి తాతగారు ఉన్నవ లక్ష్మీ నారాయణ గారితో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
"నాకు నా దేశం, నేను నా దేశానికి" అన్న శీర్షికతో, మన దేశానికి మనమేమిచ్చామన్న విషయంపై తమ భావాలను ప్రేక్షకులతో పంచుకుంటూ, యాభయ్యేళ్ళ క్రితం అమెరికా అధ్యక్షులు జే.ఎఫ్.కే. అన్న "నీ దేశం నీకేమిచ్చిందని అడగకు, నువ్వు నీ దేశానికేమిచ్చావని అడుగు" వాక్యాన్ని గుర్తుకు తెచ్చారు పవన్ అన్నలూర్. 

కార్యక్రమంలో చివరగా స్వీయ రచనల విభాగం తుర్లపాటి ప్రసాద్ గారి అద్యక్షతన జరిగింది.
దీన్ని ప్రారంభిస్తూ టెక్సాస్ రాష్ట్రపు "గిరీశం"గా పరిగణింపబడే గిరిజా శంకర్ తమ “రుక్కుల”లోంచి ఒక కథను వినిపించి నవ్వులతో ముంచెత్తారు.
తమ ప్రసంగాన్ని రెండు-మూడు ఛలోక్తులతో ఆరంభించిన ఇర్షాద్ జేంస్ తమ రచన "విదేశీయుడు"లో భవిష్యత్తులో తెలుగునాట ఎటువంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకుంటాయో ఒక హాస్య కథానిక రూపంలో చదివి ప్రాంగణాన్ని నవ్వులతో నింపడమే కాక ఆలోచింపజేసారు.
యువకవి శరత్ సూరంపూడి ఎంతో సరళమైన భాషతో, చక్కటి మలుపులతో వ్రాసిన భావకవిత్వం సభికులని ఆకట్టుకున్నాయి. తరువాత ఉమ పోచంపల్లి గారు తమ కవితల సంపుటిలోంచి ఒక కవితను, తమ స్వానుభవాలు ఆధారంగా చేసుకొని వ్రాసిన ఒక చిన్న కథను వినిపించారు.
 ముగింపుగా డా. వేంకట రాజు త్వరలో రాబోతున్న జయ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ “ఉగాది” అనే కవితనూ, భారతదేశంలో జరుగుతున్న రాష్ట్రవిభజనకు సంబంధించి సందర్భోచితంగా “నా తెలంగాణ” అనే కవితనూ రాగయుక్తంగా పాడి వినిపించారు.

హ్యూస్టన్ నగరంలోని తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు మారుతి రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ తరఫున సాహిత్య సంబంధమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోద్బలం ఉంటుందని వక్కాణించారు.

షడ్రుచుల వంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన కార్యక్రమాన్ని “హ్యూస్టన్ సాహీతీ లోకం” కార్యవర్గం తరఫున మధు పెమ్మరాజు సహాయ, సహకారాలు అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ సదస్సును ముగించారు.

జరుగుతున్నదీ జగన్నాటకం … 44వ "వెన్నెల" కార్యక్రమంలో "సిరివెన్నెల" రచనకు వివరణ

చిత్రం: కృష్ణం వందే జగద్గురుం; రచన: "సిరివెన్నెల" సీతారామ శాస్త్రి

వివరణ: చిలుకూరి సత్యదేవ్ (మూలం: జీడిగుంట విజయసారధి)

జరుగుతున్నదీ జగన్నాటకం ...జరుగుతున్నదీ జగన్నాటకం ...
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కధనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం 
జరుగుతున్నది జగన్నాటకం ...జరుగుతున్నది జగన్నాటకం ...
భాగవత లీలలన్నిటిలోనూ, భగవంతుని అవతారాలన్నిటిలోనూ మన నిత్య జీవితానికి పనికొచ్చే సత్యాలుంటాయని చెప్పే గీతం. అందులో మానవాళిని ప్రోత్సహిస్తూ అవతారాల్లోని అంతరార్థాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

చెలియలి కట్టను తెంచుకుని …విలయము విజృంభించునని 
ధర్మ మూలమే మరచిన జగతిని …యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి …సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ తోవను చూపిన మత్స్యం …కాల గతిని సవరించిన సాక్ష్యం 
ధర్మం నాశనమై ప్రళయం వచ్చినప్పుడు మత్స్యావతారంలో లోకానికి ఒక క్రొత్త ఆరంభాన్ని అందించిన అవతారం. అవసరమైతే ఒక చిన్న చేప కూడా కాలగతిని మార్చగలదు - ప్రళయము, సునామీలు వచ్చినా ఎప్పుడూ నేను చిన్నవాణ్ణని వెనుకంజ వేయకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి.
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే 
పొందగోరిన దందలేని నిరాశతో అణగారి పోతే 
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది 
క్షీర సాగర మధన మర్మం
గొప్ప పనులు తలపెట్టినప్పుడు ఎన్నో కష్టాలొస్తాయి, చావు వచ్చేంతటి పరిస్థితి రావచ్చు, మోయలేని బరువులను మోయవలసి రావచ్చు. అయినా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి, సముద్ర మథనం సాగినట్లుగా, చివరకు కోరిన ఫలితాలొస్తాయి. నిరాశలో మునిగిపోతున్న మానవులకు ఓర్పుతో ముందుకు సాగిపోవాలనే స్ఫూర్తినిచ్చే అవతారమే కూర్మావతరం"బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పులు" - సముద్ర మథన సమయంలో సర్పరాజు వాసుకి నోట వచ్చిన హాలాహలం.

ఉనికిని నిలిపే ఇలను కడలి లో కలుపగనురికే ఉన్మాదమ్మును...
కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉధ్ధరించగల...
ధీరోధ్ధతి రణ హుంకారం... ఆదివరాహపు ఆకారం...
మన మనుగడనే ముంచి వేసే దుష్టులను అంతమొందిచడానికి కావలసిన ధైర్యాన్ని మనకు కలిగిస్తూ భీభత్స రసాన్ని చూపించే అవతార వర్ణన ఇది - వరాహావతారం.

ఏడీ ఎక్కడరా.. నీ హరి దాక్కున్నాడేరా భయపడి ...
బయటకి రమ్మనరా ఎదుటపడి... నన్ను గెలవగలడ తలపడి...

నువు నిలిఛిన ఈ నేలను అడుగు... నీ నాడుల జీవజలమ్మును అడుగు...
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు... నీ ఊపిరిలో గాలిని అడుగు...
నీ అణువుల ఆకాశాన్నడుగు.. నీలో నరునీ హరినీ కలుపు..
నీవే నరహరివని నువు తెలుపు....

"ఇందుగలడందు లేడని సందేహము వలదు" పద్యాన్ని జ్ఞప్తికి తెచ్చే చరణం ఇది. నేల, (జీవ)జలం, (రక్తపు వెచ్చదనం) అగ్ని, (ఊపిరిలో) గాలి, (అణువణువుకూ మధ్యనున్న) ఆకాశం - ఇలా పంచభూతాల లోనూ ఉన్నాడు హరి; పంచభూతాలెక్కడో లేవు, నీలోనే వున్నాయి - అంటే హరి నీలోనే వున్నాడు అంటూ "మానవుడే మాధవుడు" అనే తత్వాన్ని నరసింహావతారం ఉపోద్ఘాతంలో వెలికి తీసారు కవి.
ఉన్మత్త మాతంగ  భంగి ఘాతుక వితతి
హంతృ  సంఘాత  నిర్ఘృణ  నిబడమే  జగతి
అఘము  నగమై  ఎదిగే  అవనికిదె  అశనిహతి
ఆతతాయుల  నిహతి  అనివార్యమౌ  నియతి  ..
శితమస్తి  హత  మస్తకారి  నఖ  సమకాశియో  ..
క్రూరాసి గ్రోసి  హుతదాయ దంష్ట్రుల  ద్రోసి  మసిజేయు  మహిత  యజ్ఞం
సందర్భోచితంగా ఎంతో భీకరమైన దృశ్యాన్ని చిత్రిస్తూ అందుకు తగ్గట్టుగానే చాల గట్టి పదజాలాన్ని వాడుతూ నరసింహుడు రాక్షసుణ్ణి చంపే సందర్భాన్ని వర్ణించారు సిరివెన్నెల.

“హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం”

ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సమూహము)
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి 
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు)

ఆతతాయుల ( గర్భస్థ శిశువును సైతం సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం)

అమేయమనూహ్యమనంత విశ్వం..
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం.. ఈ మానుష రూపం...
కుబ్జాక్రుతిగా.. బుధ్ధిని భ్రమింపజేసే... అల్ప ప్రమాణం...
ముజ్జగాలను మూడడుగులతొ కొలిచే త్రైవిక్రమ విస్తరణం...
జరుగుతున్నది జగన్నాటకం.... జరుగుతున్నది జగన్నాటకం....

అనంత విశ్వంలో అతి చిన్న రేణుసమానుడైన మానవుడు తన మేధస్సును వాడి మూడడుగులు వేసినంత సులువుగా ముల్లోకాలనూ జయించగలడని సిరివెన్నెల గారు వామనావతారాన్ని విశ్లేషించారు.
పాపపు తరువై.. పుడమికి బరువై... పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ..
పరశురాముడై.. భయదభీముడై.. ధర్మాగ్రహ విగ్రహుడై నిలఛిన...
శోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు...
 
పాపాలు బాగా విస్తరించిపోయినప్పుడు వాటిని కూకటివేళ్ళతో సహా పెళ్ళగించడానికి సత్వగుణంతో పాటు రజోగుణం కూడా కావాలని, ధర్మాన్ని నిలపడం కోసం బ్రాహ్మణుడిగ పుట్టినా క్షాత్రాన్ని, ఆగ్రహాన్ని వాడిన పరశురామావతారానికి వివరణ ఇది.

మహిమలూ లేక మాయలూ లేక
నమ్మశక్యము గాని మర్మమూ లేక 
మనిషి గానే పుట్టి మనిషి గానే బ్రతికి 
మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి (మని  = lifestyle)
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచె 
రామావతారాన్ని అతి సులువైన మాటలతో, రాముడు ఎంత సామాన్య మానవుడిలా బ్రతికాడో చెప్పడమైనది. అటువంటి జీవనవిధానంతో కూడా కలకాలం నిలిచిపోగలడు మానవుడని ఋజువు చేసారు.
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా.. నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము....


అనిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిఘా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా
నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా... సస్వరూపమే.. విశ్వరూపమ్ముగా.
నరుని
లోపలి పరుని పై దృష్టి పరుపగా 
తల వంచి కైమోడ్చి సిష్యుడవు నీవైతే 
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే 
ప్రతి మనిషీ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విధాలుగా భాసిస్తాడు. జ్ఞానంతో ఆ కోణాలన్నీ మనలో మనమే తెలుసుకోవచ్చును.
అష్టసిద్ధులూ మనలోనే వున్నాయి, వాటిని వాడుకుని మనమే విశ్వరూపం చూపించవచ్చు. ఈ విషయాన్ని తెలియజేసే అవతారమే జగద్గురువైన కృష్ణావతారం.
నీలోని గురువుకు నీవే తల వంచి శిష్యుడవైతే నీలోని అజ్ఞానాన్ని నీవే పోగొట్టుకునే అవకాశం వుంటుంది.
అద్వైత సిద్ధాంతాన్ని ఈ విధంగా చూపుతూ పాటను పూర్తి చేసారు సిరివెన్నెల.

వందే కృష్ణం జగద్గురుం ... వందే కృష్ణం జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం ...కృష్ణం వందే జగద్గురుం ...
వందే కృష్ణం జగద్గురుం ...వందే కృష్ణం జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం ...కృష్ణం వందే జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం !

****************************************

{మిత్రులు జీడిగుంట విజయసారథిగారు idlebrain.com లో ఆంగ్లంలో వ్రాసిన విశ్లేషణ ఆధారంగా - ఆయనకు ధన్యవాదాలతో...}